తప్పు ట్రైన్ ఎక్కితే దిగిపోవడమే మంచిది.. విడాకులపై స్పందించిన హన్సిక!
- సోహెల్ తో విడాకులు తీసుకున్న హన్సిక
- తనకు వ్యక్తిగత ప్రశాంతతే ముఖ్యమని వెల్లడి
- కష్టకాలంలో తన కుటుంబం అండగా నిలిచిందన్న హన్సిక
తెలుగు, తమిళ చిత్రాలతో 'యాపిల్ బ్యూటీ'గా పేరు తెచ్చుకున్న హన్సిక, తన విడాకుల వార్తలపై ఎట్టకేలకు మౌనం వీడారు. భర్త సోహెల్ కతురియాతో నాలుగేళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ ముంబై కోర్టులో విడాకులు తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె తనదైన శైలిలో స్పందించారు. "మనం తప్పు ట్రైన్ ఎక్కామని తెలిసినప్పుడు, వీలైనంత త్వరగా దిగిపోవడమే మంచిది" అంటూ వైవాహిక బంధం ముగియడంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. తన నిర్ణయం పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆమె స్పష్టం చేశారు.
జనాలకు హెడ్ లైన్స్, క్లిక్ బైట్స్ కావాలి కానీ, తనకు వ్యక్తిగత ప్రశాంతత అంతకంటే ముఖ్యమని హన్సిక పేర్కొన్నారు. విడాకుల తర్వాత మానసిక ప్రశాంతత కోసం జపాన్ వెళ్లి వచ్చానని, ఈ కష్టకాలంలో తన కుటుంబం అండగా నిలిచిందని తెలిపారు. 2022లో అట్టహాసంగా జరిగిన ఈ వివాహం, ఓటీటీలో డాక్యుమెంటరీగా కూడా విడుదలైంది. అప్పట్లో హన్సిక తన స్నేహితురాలి మాజీ భర్త అయిన సోహెల్ ను పెళ్లాడడం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు వీరిద్దరి బంధం కూడా ముగియడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏదేమైనా, తన శ్రేయస్సుకే ప్రాధాన్యతనిస్తూ హన్సిక తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.